శుక్రవారం ఈ ఆహారాలు తింటే పేదరికాన్ని కొనితెచ్చుకున్నట్టేనట..!

 

శుక్రవారం ఈ ఆహారాలు తింటే పేదరికాన్ని కొనితెచ్చుకున్నట్టేనట..!


హిందూ మతంలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది.  ఒక్కొక్క రోజు ఒకో దేవుడిని పూజించడం పరిపాటి.  ఇక శుక్రవారం రోజు లక్ష్మీదేవి, సరస్వతి,  దుర్గ.. ఇలా శక్తి స్వరూపాలను  పూజిస్తారు. మరీ ముఖ్యంగా చాలామంది లక్ష్మిదేవి అనుగ్రహం కావాలని ఎంతగానో కోరుకుంటారు. శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనుగ్రహానికి  పరిహారాలు పాటించడం చేస్తుంటారు. అయితే శుక్రవారం రోజు కొన్ని ఆహారాలు తినడం  వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని, దీని వల్ల ఆ ఇంట్లో ధనం మెల్లిగా కనుమరుగవుతుందని కూడా అంటారు.  ఇంతకీ శుక్రవారం రోజు తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే..

చాలామంది  తరచుగా  ఆహారపు అలవాట్లను నిర్లక్ష్యం చేస్తారు. కానీ శుక్రవారం నాడు కొన్ని ఆహారాలు తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. శుక్రవారం తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి.  ఈ ఆహారాలు తింటే లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట.

పుల్లని పదార్థాలు..

శుక్రవారం నాడు పుల్లని పదార్థాలు  తినకూడదని చెబుతారు.  నిమ్మకాయ, చింతపండు, మామిడికాయ ఊరగాయ వంటివి తీసుకోవడం మహా పాపంగా పరిగణించబడుతుందట. హిందూ నమ్మకాల ప్రకారం  సంతోషి మాత గౌరవార్థం, అమ్మ అనుగ్రహం కోసం  శుక్రవారం  రోజున ఉపవాసం  పాటిస్తారు.  పుల్లని పదార్థాలు తింటే అమ్మ అసంతృప్తి చెందుతుందట. జ్యోతిషశాస్త్రం ప్రకారంగా చూస్తే  పుల్లని పదార్థాలు తినడం వల్ల ఆనందం,  శ్రేయస్సుకు కారణమైన శుక్ర గ్రహం బలహీనపడుతుందట.

వెల్లుల్లి, ఉల్లిపాయ..

ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేసేవారు తీసుకునే ఆహారం చాలా సాత్వికంగా ఉండాలని చెబుతారు. శుక్రవారం లక్ష్మీ దేవిని పూజించి ఆ అమ్మ అనుగ్రహం పొందాంటే వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి తామసిక  ఆహారాలను శుక్రవారం  రోజున తినకూడదు. సాత్విక ఆహారాలు తినడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అలాగే ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది.  శుక్రవారం ఉపవాసం పాటిస్తే  మాత్రం  వెల్లుల్లి, ఉల్లిపాయలను పూర్తిగా మానేయడం తప్పనిసరి.


మద్యం, మాంసం..

 శుభ దినం  లేదా దేవతలకు  పూజ చేసే రోజుల్లో  మాంసం,  మద్యం సేవించడం మహా పాపంగా పరిగణిస్తారు. ముఖ్యంగా  శుక్రవారాల్లో అలా చేయడం వల్ల లక్ష్మీదేవి  ఇంటి నుండి వెళ్లిపోతుందని చెబుతారు.  దీని వలన ఆర్థిక నష్టమే కాకుండా కుటుంబంలో విభేదాలు, అశాంతి కూడా పెరుగుతాయట.

పాలు, పాల ఉత్పత్తులు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం నాడు పెరుగు,  పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోవడం అశుభకరమట. పాలు చంద్రుడు, శుక్రుడితో సంబంధం కలిగి ఉంటాయట. పెరుగు పాలు ఆర్థిక అస్థిరతను సూచిస్తాయట. మరీ ముఖ్యంగా విరిగిన పాలను ఉపయోగించడం,  పెరుగు,  అందులోనూ పుల్లని పెరుగు వంటివి ఉపయోగించడం మంచిది కాదట.  శుక్రవారం రోజున తాజా పాలను, తాజా పాలతో చేసిన తీపి పదార్థాలను తీసుకోవచ్చు. అలాగే లక్ష్మీగదేవికి నైవేద్యంగా కూడా పెట్టవచ్చు.

శుక్రవారం తెలుపు ఆహారాలు,  తెల్లని వస్తువులు దానం చేయడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు. బియ్యం, పాలు, చక్కెర కలిపి క్షీరాన్నం వండి లక్ష్మీదేవికి నివేదించడం వల్ల అమ్మవారు తృప్తి పడతారని చెబుతారు.

నియమాలు ఎందుకు పాటించాలి..

ఇటు జ్యోతిష్యం ప్రకారం చూసినా, అటు  పద్మ పురాణం ప్రకారం చూసినా.. శుక్రవారాల్లో నియమాలను పాటించడం వల్ల శుక్ర గ్రహం బలపడుతుందట.  శుక్రుడు బలంగా ఉన్నప్పుడు జీవితంలో భౌతిక ఆనందం, శ్రేయస్సు,  సంపదను సులభంగా పొందగలుగుతారట. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారు శుక్రవారం నియమాలను తప్పకుండా పాటిస్తుంటే ఎంతో మంచిది.

                                  *రూపశ్రీ.